తండ్రి శవం ఉండగానే.. సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించారు: అచ్చెన్నాయుడు
వైసీపీ అధినేత జగన్ రాజకీయ శైలిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్కు అధికార దాహం ఎక్కువని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో, తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించిన చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఎద్దేవా చేశారు.
జగన్ కి ఉన్న అధికార పిపాసను చూసే గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, అందుకే వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అమరావతిని రాష్ట్రానికి ఒక 'అక్షయపాత్ర'లా తీర్చిదిద్దుతుంటే... జగన్, ఆయన అనుచరులు మాత్రం దానిని అవినీతికి 'కామధేనువు'గా చిత్రీకరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో తగిలిన దెబ్బ ఇంకా పచ్చిగానే ఉందని, ఇప్పటికైనా అబద్ధాలు ప్రచారం చేయడం ఆపకపోతే భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తన దిగజారుడు రాజకీయాలతో ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని, కానీ ఏపీ ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.